బీఆర్ఎస్ వారితో మేము ఎందుకు భేటీ అవుతాం.. అని ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీతో కలిసే అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కాలరాశారని, నియంతృత్వంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం రేవంత్ వచ్చి సంవత్సరం అయిందని, ఇప్పుడు అదే పరిస్థితి ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేసిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే రేవంత్ రెండు నాలుకల ధోరణితో నష్టం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు ఫక్తు రాజకీయాలు తప్ప ప్రజలను బాగు చేసుకొనే ఆలోచనే లేదన్నారు.
కాళేశ్వరం కమిషన్ వేసి 7 సార్లు వాయిదా వేసిందని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మీరు వేసిన ఇతర కమిషన్ల రిపోర్ట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఏం చేశారని నిలదీశారు. రెండు పార్టీలు కేవలం బయటికి కొట్లాట లోపల ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గెలవడం పగటి కల అని, వారి హయాంలోనే కాళేశ్వరం కుంగిందన్నారు. వారి వాలకం వల్లనే రాష్ట్రం అప్పుల ఊబిలో కుంగి పోయిందన్నారు. రెండు పార్టీలు ప్రజల ఆశలు అడియాశలు చేశాయని, తెలంగాణ ప్రజలకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుందన్నారు. జిమ్మెదార్ బాధ్యత గల పార్టీ బీజేపీ అని, ప్రధాని మోడీ అండతోనే అభివృద్ధి సాధ్యం అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.