18 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2025 విజేతగా తొలి ట్రోఫీని ముద్దాడింది. జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య ఉత్కంఠ సాగిన పోరులో బెంగళూరు 6 పరుగుల తేడాతో తన కలను నెరవేర్చుకుంది. తొలి సీజన్ నుంచి ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తోన్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం తనతోపాటు తన అభిమానులకు సైతం ప్రత్యేకమని చెప్పారు. ఇక ఆర్సీబీ ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన వేళ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు, కోహ్లీ అభిమానులు టపాసులు కాలుస్తూ డీజే పాటలు ఊరేగింపులతో మిన్నంటే సంబరాలు జరుపుకుంటున్నారు.
సామాన్య అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆర్సీబీ విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఆర్సీబీ విజయం సాధించిన వేళ భావోద్వేగానికి గురయ్యాడు. తను కోహ్లీకి వీరాభిమానిని చెబుతూ ఆర్సీబీ విజయంపై అమితానందం వ్యక్తం చేశారు. తలపై బాటిల్తో నీళ్లు కుమ్మరించుకొని విభిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.