వలసలను ఆపేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు..

kcr-26-.jpg

బీఆర్ఎస్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కంటిన్యూ అవుతుండటం, పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వలసలను ఆపేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో ఫాంహౌస్ లో బుధవారం సమావేశమయ్యారు. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తో ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ చర్చలు జరిపారు. పార్టీ మారుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ వారికి సూచించారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. మెయిల్‌, పోస్ట్‌ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం, సంజయ్‌, కడియం శ్రీహరితో పాటు, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. స్పీకర్‌ అపాయింట్‌మెంట్ అడిగితే స్పందించకపోవడంతో మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారడమంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించమని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారంటూ నిలదీశారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు పడే వరకు పోరాటం చేస్తామంటూ స్పష్టంచేశారు.

Share this post

scroll to top