ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ కుట్ర వెనుక జనసేన నేత, రాజమండ్రి నగర ఇంచార్జ్, అనుశ్రీ ఫిలిల్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సత్యనారాయణను పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా ఎగ్జిబిటర్ అత్తి సత్యనారయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాపై తాను కుట్రలు చేయలేదని అన్నారు. దిల్ రాజు కావాలనే తనపై నిందలు వేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన దేవుడని ప్రాణమని, అలాంటి వ్యక్తి సినిమాను తానేందుకు ఆపుతానని అన్నారు. దమ్ముంటే దిల్ రాజు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకునే టైమ్కి వీరమల్లు విడుదల తేదీని ప్రకటించలేదని తెలిపారు. తాము ఏప్రిల్ 24న నిర్ణయం తీసుకుంటే మే 16న వీరమల్లు విడుదల తేదీని ప్రకటించారని పేర్కొన్నారు. తాను ఎప్పుడు పవన్ కళ్యాణ్కు విధేయుడిగానే ఉంటానని అత్తి సత్యనారాయణ అన్నారు.