రాష్ట్రంలో రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కల్వకుంట్ల కుటుంబంతో పాటు కవిత డ్రామాలు ఆడటం మొదలు పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంత వరకు కరెక్టో తమకు తెలియదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు టీ కప్పులో తుఫాను లాంటివని తెలిపారు. ఆ విషయాన్ని తాము ఏ మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదని బీఆర్ఎస్ పార్టీ ఏమైపోతే తమకెందుకని అన్నారు. పార్టీలో ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసెస్ అని అది వాళ్లే తేల్చుకోవాలని కామెంట్ చేశారు. ఈ మధ్య బీఆర్ఎస్ లీడర్లకు వార్తల్లోకి ఎక్కాలనే ఉబలాటం ఎక్కువైందని అన్నారు. బీఆర్ఎస్లో విబేధాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
కేసీఆర్ కుటుంబంపై పొన్నం ఘాటు వ్యాఖ్యలు..
