బడ్జెట్‌ సమావేశాలు రేపటికి వాయిదా..

parlament-31.jpg

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బడ్జెట్‌ సమర్పించడానికి ముందు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఆ తర్వాత నిర్మలమ్మ ఆర్థిక సర్వేను రాజ్యసభ ముందుకు తీసుకెళ్లారు. అనంతరం స్పీకర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. ఉభయసభలు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్‌(సవరణ) బిల్లు, బ్యాంకింగ్‌ చట్టాల బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. 

Share this post

scroll to top