విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుందని స్పష్టం చేశారు నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు మొదలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థుల వరకు అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోవైపు, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.