ప్రజలకు పండగ దినమని కూటమి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఇది సుద్ధ దండగ ప్రభుత్వమని వైయస్ఆర్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, గురుమూర్తి ల గురుమూర్తి ఎద్దేవా చేశారు. వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వెంకటాచలం సర్వేపల్లి రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీలు మాట్లాడుతూ ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు ప్రజలకు పండగ దినమని కూటమి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇది పండగ చేసే ప్రభుత్వం కాదని సుద్ద దండగ ప్రభుత్వం అని ప్రజలు అనుకొంటున్నారని తెలిపారు. కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావానంలా దహిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులతో వైయస్ఆర్సీపీ కార్యకర్తలని, నాయకులను వేదిస్తున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైఫల్యాలపై ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.