ఎన్నికల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారని కానీ, పథకం ప్రారంభం కాకముందే తుస్సుమందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడుతూ కూటమి సర్కార్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంలోనే రూ.లక్షా 51 వేల కోట్ల అప్పులు చేసిందని కామెంట్ చేశారు.
ఉచిత బస్సు పథకం అంటూ ఆర్భాటం చేశారని ఇంత వరకు ఆ పథకం దిక్కులేకుండా పోయిందని అన్నారు. సంక్రాంతి పండుగల లోపు రోడ్లను పూర్తి చేస్తామని చెప్పిన ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని తెలిపారు. పనులు పూర్తైనా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం దారణమని ధ్వజమెత్తారు. వల్లభనేని వంశీతో పాటు చాలామంది వైసీపీ నేతలపై తప్పులు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి పతనానికి గన్నవరం లోనే నాంది పడిందని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కూటమి సర్కార్ అప్పులు చేసి ప్రచారాలు చేసుకుంటుందని పథకాల అమలును మాత్రం గాలికొదిలేశారని పేర్ని నాని అన్నారు.