వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ టీడీపీ మహానాడుకు మాత్రం బయటపెట్టి, బెదిరించి తరలించారు. ఇది ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా అమలు చేసిందా అని నిలదీశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ? ఏ పథకం అమలు చేశారు? చూపించగలరా? అని రాచమల్లు ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోసం, కుట్రలు, వెన్నుపోట్లతో పాలనను నడిపించారని ఆయన మండిపడ్డారు. విద్యుత్, RTC, నీటి బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలిపేలా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినందుకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.