సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో దానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పొరుగు దేశం. నో మోర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ, బరి తెగించి పాక్ రంకెలు వేస్తోంది. భారత్తో తమకు హద్దుల్లేవు, సరిహద్దుల్లేవు అంటూ కారం తిన్న కాకి లాగా మండిపడుతోంది. 1971లో భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత, 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, 1971 డిసెంబర్ 17నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చారు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా, ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశం.
ఈ ఒప్పందం వల్ల ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా, కశ్మీర్ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని, నానా యాగీ చేయొచ్చని పాకిస్తాన్ పన్నాగం పన్నింది. దీనికితోడు LOC లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాక్ ప్లాన్ చేసింది. ఇక సిమ్లా ఒప్పందం రద్దయితే పీవోకేని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి భారత్కి అవకాశం దొరికినట్టే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయిందబ్బా అంటున్నారు. మొత్తానికి భారత్ పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.