వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ పాలకమండలి బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయ్యారని , భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. టీటీడీ చైర్మన్, ఈవోల మధ్య సమన్వయ లోపం ఉందని స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.
చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయ్యారని పేర్కొన్నారు. వైఎస్ జగ్ హయాంలో ఏనాడు, ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరుగలేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయా అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. తిరుపతి ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ మొత్తం ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.