నటుడు మాజీ వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ పై ఇటీవలే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానికి బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గం లోని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ క్రమంలోనే పోసాని మురళీకృష్ణ అరెస్ట్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు ఆయన స్వయంగా పోసాని సతీమణికి ఫోన్ చేసి పరామర్శించారు. అనంతరం రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అదేవిధంగా పోసాని అరెస్ట్పై ఆయన తరఫు న్యాయవాది బాల పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అరెస్ట్ విషయంలో పోలీసులు సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించలేదని ఫైర్ అయ్యారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పోసాని అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని న్యాయవాది బాల అన్నారు.