ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని వైయస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. ప్రజల తరఫున టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ప్రశ్నించడం మానేశాయని, ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్లో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్లు చేయిస్తున్నాడు అంటూ పోసాని నిలదీశారు.
నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ 5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు టీవీ5 నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు? అని పోసాని ప్రశ్నించారు. పని చేయని ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లతో ప్రమాదం లేదు. ఓట్లు వేయించుకుని హామీలు నెరవేర్చని వాళ్లతోనే ప్రమాదం.