బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్పేషెంట్, ఇన్ పేషెంట్ ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది.
సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి.