ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీబిజీ గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన అధికారిక నివాసంలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్నారు. దావోస్ పర్యటన తర్వాత ఈరోజు అర్ధరాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సమావేశానికి రావాలని కొంతమంది మంత్రులకు పిలుపు అందింది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారం, నేతల వైఖరి ప్రకటనలపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.