వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. ఓ పక్క నైరుతి రుతుపవనాలు, మరోవైపు తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది.
దీనిప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే రైతన్నలు నష్టపోయారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు చేరినా కొనుగోళ్లు త్వరితగతిన జరగకపోవడంతో తీవ్రనష్టం జరిగిందని వాపోతున్నారు. మిగతా పంటలు సైతం అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. తెలంగాణలోనూ నైరుతి వేగంగా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.