ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ గతంలో ఒకసారి విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే స్పష్టం చేసింది.
ఈ కేసులో మరోసారి విచారణకు రావాలని మే 26న ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. మే 28న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం అమెరికాకు వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హజరవుతానని కేటీఆర్ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది.