పోలీసులు వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం.
సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా? మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది? నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజని అన్నారు.