ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ పై ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రేషన్ వాహనాల డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంపై డ్రైవర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ తరుణంలో రేషన్ వాహనాలను ప్రభుత్వం హఠాత్తుగా తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. అయితే వారు 2027 వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయామని, రుణాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఆర్థిక పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇక, ఈ అంశం పై కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.