ఈ రీ రిలీజ్ శ్రీదేవికి అంకితం..

megastar-09.jpg

మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు బి.ఏ తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ తెరకెక్కించి ప్రభంజనం సృష్టించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న మళ్లీ విడుదల చేయబోతోన్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు నాటి విషయాల్ని పంచుకున్నారు.  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ..

జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయి అప్పుడే 35 ఏళ్లు అవుతోందా? అని అనిపిస్తోంది. ఆ మూవీ రోజులు, షూటింగ్‌లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడిప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. శ్రీదేవితో అంతకు ముందు ఓ రెండు చిత్రాల్లో నటించాను. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫస్ట్ సినిమా అన్నంతగా జనాలు ఫిక్స్ అయిపోయారు. ఆ టైంలో రాఘవేంద్ర రావు గారి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మూవీ అనుకుంటున్న టైంలో చాలా మంది ఆయన వద్దు అని సలహాలు ఇస్తూ వచ్చారు. కానీ నేను, దత్ గారు మాత్రం చేస్తే రాఘవేంద్రగారు చేయాలి లేదంటే అసలు ఈ సినిమానే వద్దు అని అనుకున్నాం. సినిమా రిజల్ట్‌ను పట్టి మనిషి టాలెంట్‌ను అంచనా వేయొద్దు. ఓ టెక్నీషియన్‌గా రాఘవేంద్రరావు గారు ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఈ మూవీ కోసం రాఘవేంద్రరావు గారు ప్రాణం పెట్టారు. అందరి ఇన్ పుట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని చెక్కారు. ఈ మూవీ కోసం 27 మంది రైటర్స్ పని చేశారు. నేను కూడా ఈ మూవీ కోసం రైటింగ్ డిపార్ట్మెంట్‌లో 35 రోజులు పని చేశాను. ఇళయారాజా గారు ఈ సినిమా కోసం ప్రతీ పాట మూడు, నాలుగు గంటల్లో కంపోజ్ చేసేశారు.

‘అమ్మనీ తీయని దెబ్బ’ అనే పాట ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నంకి కంప్లీట్ అయిపోయింది. ఈ పాటను ఒకటిన్నర రోజుల్లోనే షూట్ చేసేశాం. అసలు ఈ కథను కొన్ని రోజులు మానస సరోవరం కాకుండా చంద్రమండల మీద అని అనుకున్నాం. కానీ చివరకు మానస సరోవరం అయితే కాస్త నమ్మశక్యంగా ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యాం. ఆ మానస సరోవరాన్ని విజయ వాహినీ స్టూడియోలో రాఘవేంద్ర రావు అద్భుతంగా క్రియేట్ చేశారు. ఈ రీ రిలీజ్‌లో శ్రీదేవీ గారిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ రిలీజ్ ఆమెకు అంకితం. ‘దినక్కుతా’ అనే పాటను చివరగా షూట్ చేశాం.

ఆ టైంలో నాకు తీవ్ర జ్వరం వచ్చింది. నిలబడే ఓపిక లేకపోయినా, రిహర్సల్స్ చేసే శక్తి లేకపోయినా ఎలాగోలా షూట్ చేశాం. గుమ్మడి కాయ కొట్టేశారు అని తెలియడంతో ఇక నేను కూలిపోయా. వెంటనే నన్ను విజయ హాస్పిటల్లో చేర్చారు. రెండ్రోజుల తరువాత స్పృహలోకి వచ్చాను. అప్పుడు నాకు మలేరియా అని తెలిసింది. మంచి రిలీజ్ డేట్‌ను మిస్ అవ్వొద్దని, సినిమాకి, నిర్మాతకి, నాకు చాలా నష్టం కలుగుతుందని కష్టమైనా సరే ఎలాగోలా షూటింగ్ చేసేశాను. ప్రొడ్యూసర్లను ఎలా గౌరవించాలనేది ఎన్టీ రామా రావు గారి నుంచి నేర్చుకున్నాను. నేను దర్శక, నిర్మాతల్ని అమ్మానాన్నల్లా గౌరవిస్తాను. విన్సెంట్ గారు ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా మలిచారు. భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి వెళ్లేటప్పుడు గుడిసె తెరుచుకునే సీన్‌ను ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వరకు ఫినిష్ చేశారు. ఇప్పుడు ఆ షాట్ తీయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో. ఆ టైంలోనే ఆయన వండర్స్ చేశారు.

ఇక ఈ చిత్రం కోసం ప్రభుదేవా చేసిన ‘అబ్బనీ తీయని దెబ్బ’ అనే పాట ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. సుందరం మాస్టార్ భయపడుతున్నా కూడా ప్రభు దేవాని నేను తీసుకుని వెళ్లి పాటలు ఇచ్చేవాడిని. 16 ఏళ్ల వయసులోనే ప్రభుదేవాకి ఉన్న టాలెంట్ ఏంటో నాకు అర్థమైంది. అందుకే నేను ప్రత్యేకంగా ప్రభుదేవాకి పాటలు ఇస్తుండేవాడిని. ఎంతో శక్తి ఉన్న ఆ రింగుని చేప మింగిన తరువాత ఏం జరిగింది? అనే పాయింట్‌ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అశ్వనీదత్ గారి పిల్లలు ఎలాగూ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తారు. ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉండరు. ఇప్పటి తరం ఈ రీ రిలీజ్‌ను చూడండి. మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్లి సినిమాను చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

Share this post

scroll to top