జూరాల ప్రాజెక్టుకు గత మూడు రోజులుగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,258 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. కంటిన్యూగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.490 మీటర్లకు చేరుకుంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంలీలు కాగా ప్రస్తుతం 5.928 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న వరద ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో జూరాల డ్యామ్ పూర్తి స్థాయికి నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే శ్రీశైలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉప నదులకు వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం జులై నెలలో వరద ప్రారంభం అవ్వనుండగా ఈ సారి అకాల వర్షాల కారణంగా ముందస్తుగానే శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చి చేరుకుంటుంది. బుధవారం ఉదయానికి ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల వరద వస్తుండగా 19,070 క్యూసెక్కులు ఔట్ ఫ్లో దిగువకు వెళ్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ముందస్తుగానే వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద కంటే దిగువకు వెళ్తున్న ఔట్ ఫ్లో అధికంగా ఉంది.