సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక, రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు, పలుకు లేదు అని హరీష్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మంత్రులు కూడా వినడం లేదు అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ పాలన అంతా సగం సగం ఆగం ఆగం ఉందన్నారు. దేవుడినే మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి చేతికి ఇస్తే అంత ఆగం చేస్తున్నాడు. ఏడాదిలోనే లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు. రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లకు రంగులు మాత్రం వేస్తున్నారు. 10 ఏళ్లు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇవ్వాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.