సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, 2025న జరగనున్న నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం పి. విల్సన్, ఎస్.ఆర్. శివలింగం, కవిన్నా సల్మాల పేర్లను రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతోపాటు మక్కల్ నీది మయ్యం తరపున కమల్ హాసన్ పేరును తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి.
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటంబం ఉంది. అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష కూడా తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించారని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.