మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ధర్మవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో కాబట్టి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని పేర్కొన్నారు. హిందూపూర్లో కాకుండా అదే గుడివాడ అయితే మూడు సార్లు గెలవలేరని చెప్పుకొచ్చారు. సినిమా హీరోగా ఉన్న చిరంజీవి కూడా రెండు చోట్ల నిలబడి సొంత నియోజకవర్గంలో పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ఇద్దరికి మాత్రమే ఒకటి పొలిటికల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండు సినిమా హీరోగా పవన్ కల్యాణ్ మాత్రమే అని స్పష్టం చేశారు. జగన్ అయినా పవన్ కల్యాణ్ అయినా వస్తే 10 నిమిషాల్లో 10 వేల మంది గుమ్మికూడతారు. వారిమీద ప్రేమతో ప్రజలు వస్తారని తెలిపారు. కానీ, చంద్రబాబు కావొచ్చు టీడీపీ కావొచ్చు అంతా మేనేజ్మెంట్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఇక, సౌతిండియాలోనే హీరోయిజం ఉంటుంది. హీరోని దేవుడిలాగా కొలుస్తారని తెలిపారు. కానీ, హీరోయిజం మాత్రం కేవలం క్యారెక్టర్ మాత్రమే అని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.