ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆటంకాలు సృష్టించినా పేదోడి కలను నెరవేర్చి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లు ను ఇవాళ ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. ఉండడానికి ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని భరోసానిచ్చారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పంట సాగు చేస్తోన్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.12 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్టులను కూడా మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.