తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది.
షష్టిపూర్తి’ సినిమా సక్సెస్ మీట్లో ఈ వివాదంపై మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఈ మధ్య కొన్ని ఫంక్షన్స్లో నేను మాట్లాడుతుంటే, గబుక్కున దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. అది మీ ఖర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుని ఉంటే, అది మీ సంస్కారం. నేనైతే ఇలానే ఉంటా, అని ఆయన అన్నారు. అంతేకాకుండా, “నేను ఎప్పుడూ మీడియాను మీడియా అని పిలవను, నా ఫ్యామిలీ అని పిలుస్తాను. మీ అందరూ నన్ను అన్నయ్య అని పిలవడమే నా జన్మ ధన్యం, నా అదృష్టం. ఈ మధ్య నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్, నేను తీసుకొచ్చిన యాక్టర్లతో సరదాగా ఉంటే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టు ఉన్నారు. అది మీ ఖర్మ, అని వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడు వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఆయన అభిమానులను నిరాశపరుస్తోంది. ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పకుండా వివాదాన్ని సమర్థించుకోవడం మరింత చర్చనీయాంశమైంది.