తెలంగాణలోని ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరిగంతేసే వార్త వినిపించింది. పెండింగ్లో ఉన్న డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటించనున్నట్టు ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డీఏ ప్రకటించనున్నట్టు వెల్లడించారు. అయితే.. ఒకటా, రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తెలిపారు. యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా.. ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించాలని సూచించినట్టు సమాచారం. సీఎం సూచనతో ఈరోజు యూఎస్పీసీ, జాక్టో, టీటీజేఏసీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో వేం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు. బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందనలు తెలిపారు.
తెలంగాణలోని ఉద్యోగులకు DA చెల్లింపు అకౌంట్లలో జమయ్యేది అప్పుడే..
