వైసీపీలో నంబర్ టూ అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఆయన అంతరంగం ఏంటో అర్ధంగాక సతమతం అవుతున్నారట ఫ్యాన్ లీడర్స్. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని, ఏ పార్టీలో చేరేది లేదని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. ఇక తనమీదున్న కేసు విచారణకు హారవుతున్నారాయన. ఈ క్రమంలోనే కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడ్డం అప్పట్లో కలకలం రేపింది.
వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన పదాలు, జగన్ను ఉద్దేశించి రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సాయిరెడ్డి పెట్టిన తాజా ఎక్స్ మెసేజ్ చూస్తుంటే ఈయన ఆయనేనా? సడన్గా ఇంత వినయ విధేయ సాయిగా ఎలా మారిపోయారంటూ మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తాను జగన్కి హాని తలపెట్టే పని ఏదీ చేయబోనని, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటిదాకా పల్లెత్తు మాట అనలేదన్నది ఈ ఎక్స్ మెసేజ్ సారాంశం. ఫలానా రోజున జగన్ అరెస్ట్ అవుతారంటూ తాను సన్నిహితులతో అన్నట్టుగా కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోందని, అదంతా పనిలేని వాళ్ళు చేసే ప్రచారం అంటూ మండిపడ్డారాయన.