చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని, ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ చీట్స్ గా మారిపోయిందని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై స్పందించిన ఆమె ఎక్స్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని విమర్శించారు. 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా? అని, ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతి, యువకులకు నెలకి 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా? అని మండిపడ్డారు.
అలాగే ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామని చెప్పి, ఆ పథకానికి నిధులే ఇవ్వకపోవడం మోసం కాదా? అని, తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం దగా కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, 2 సిలిండర్లను ఎగనామం పెట్టారని, 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తామని, బడ్జెట్ లో ఆ ప్రస్తావన ఏదని దుయ్యబట్టారు. ఇక రైతులకు 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తామన్నారని, దానికి 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు.