తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించారు. కాగా తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడంపై కొంత కాలంగా తెలంగాణ వైపు నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో చిన్నచూపు చూస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో తనకు ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలు రెండు కళ్లు అని చంద్రబాబు చెప్పారని ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకబోవడం బాధాకరం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భేటీలో ఈ విషయంలో ఎదైనా పరిష్కారం దొరుకుతుందా అనేది శ్రీవారి భక్తులలో ఆసక్తిగా మారింది.