కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళిత, గిరిజనులు, మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాంగం విలువల్ని తాకట్టుపెట్టే విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందటంలో భూక్య చంటి సూసైడ్ ఒక ఉదంతమన్నారు. భూక్య చంటి కుటుంబ సభ్యులు వారి ఆస్తులు పంచుకుంటే ఎమ్మెల్యేకు ఏం సంబంధమన్నారు. ఒక ఎస్సీ శాసనసభ్యుడై ఉండి నీ కన్నా ఇంకా తక్కువ కులాలను దారుణంగా బూట కాళ్ళతో తన్ని చిత్రహింసలకు పెట్టాడం ఎంతవరకు న్యాయమన్నారు.
చివరకు గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో భాగస్వామినేనా అని నిలదీశారు. ఈ ఘటనకు కారకుడైన ఎమ్మెల్యే పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేసిన దాడిని కప్పు పుచ్చుకునేందుకు క్రమశిక్షణ సంఘం పేరుతో టీడీపీ కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన దానికి మ్యాండిటరీ ఇచ్చి పంపించడమా అని క్రమశిక్షణ సంఘాన్ని సూటిగా ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోలేదని, వైయస్ జగన్ బాధ్యతయుతమైన పాలన అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు చేసి, న్యాయ స్థానం ఎదుట దోషిగా నిలబెట్టాలని మేరుగు నాగార్జున డిమాండు చేశారు.