ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు దానిలోని లోటుపాట్లను సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీంతో పాటు ఈఏపీ ప్రాజెక్టులు మినహా ఏపీ సీఅర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు కేబినెట్లో ప్రతిపాదన పెట్టారు. టీటీడీలోని పోటులో పనిచేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్లో చర్చ జరిగింది.వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదన వచ్చింది.
అంతేకాకుండా, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేబినెట్ చర్చ జరిగింది. తిరుపతి జిల్లాలోని చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్లో ప్రతిపాదన వచ్చింది. అలాగే, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం,కోట మండలం లోని కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు ప్రతిపాదన చేశారు.భారత్లో తయారైన విదేశీ మద్యం,బీర్,ఎఫ్ ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణకు కేబినెట్లో ప్రతిపాదన తెచ్చినట్లు తెలిసింది.