తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై, అలాగే ఇతర సమస్యలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి మాత్రం ఎలాంటి పాత్రా లేదని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని కవిత ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ఉద్యమ కారులపై గన్నులు ఎక్కించిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పారని, ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినట్లు కవిత అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై చర్చ జరుగుతోందని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 18,800 కోట్లు ఉంటుందని ఆమె తెలిపారు.