ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ మూవీ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈనెల 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది. ఈ సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. అయితే ఈ టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే.
టికెట్ల ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు సంబంధించిన మూవీటీమ్ లను ప్రతివాదులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల పెంపు జరిగిందని ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని పిల్లో కోరారు. అయితే ఈ పిటిషన్ని నేడు విచారించిన హైకోర్టు టికెట్ల రేట్లపై సంచలన తీర్పును వెల్లడించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వగా.. ఈ అనుమతిని 10 రోజులకు కుదించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విడుదలైన 10 రోజుల వరకు పెంచిన రేట్లు అందుబాటులో ఉండనున్నాయి.