అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ ఎన్నికల సమయంలో చెప్పిన అబద్ధాలు ఇవాళ కుప్పం సాక్షిగా వైయస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి బట్టబయలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రో ధరల వ్యత్యాసాలను స్వయంగా పరిశీలించి సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఇదిగో పెట్రోల్ పై లోకేష్ చేసిన మోసం అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రలను ఎండగట్టారు. ఇవాళ తెల్లవారుజామునే కర్ణాటక బార్డర్, ఏపీలోని కుప్పంలో పెట్రోల్ ధరలు తెలుసుకొని, ఆ వివరాలను సోషల్ మీడియాలో భూమన అభినయ్రెడ్డి వెల్లడించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా, పెంచుతూనే ఉన్నారు. దేశంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయి. ఒక్క పైసా కూడా పెట్రోల్ ధరలు తగ్గించలేదు. ఓటు కోసం అబద్ధాలు చెప్పొద్దు అంటూ భూమన అభినయ్రెడ్డి చంద్రబాబు, లోకేష్లకు సూచించారు. ఓట్ల కోసం అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఓటు వేయించుకూనే వరకు వాగ్దానాలు తర్వాత పూర్తిగా మర్చిపోవడం ఇది ప్రజాస్వామ్యంలో బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. ఓటు కోసం అబద్ధాలు చెప్పొద్దని, ప్రజలను మోసం చేయొద్దని అభినయ్రెడ్డి హితవు పలికారు.