వలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీఓల ఆధారంగానే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. ప్రభుత్వం నుంచే వలంటీర్లకు చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. ఇప్పుడు వలంటీర్ల నియామకం, వారికి జీతాల చెల్లింపులతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధివిధానాలు, ఉత్తర్వులతోనే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. దానికి సంబంధించి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో జారీ చేసిన జీఓలు, బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ వలంటీర్ల కోసం చేసిన కేటాయింపుల అధికారిక ఉత్తర్వులను ఈ మీడియా సమావేశంలో ప్రజలందరికీ చూపిస్తున్నాము. వాటిని తప్పు అని కూటమి ప్రభుత్వం చెప్పగలదా? ఇవ్వన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవే. వీటి గురించి ఏ మాత్రం అవగాహన లేనట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అబద్దాలపైన అబద్దాలు చెబుతున్నారు.
వలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు..
