వరద బాధితులకు కోటి రూపాయల సాయం..

ys-jagan-4.jpg

రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ జరిగింది. ఈ సమావేశంలో విరాళం ఇస్తూ ఈ ప్రకటన చేశారు.

వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వెల్లడించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
    

Share this post