ఫోన్ ట్యాంపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న తరుణంలోనే మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తాజాగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సిద్దిపేట కు చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హరీశ్రావు, రాధాకిషన్ రావుపై 120 (B), 386, 409, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన ఫోన్ను హరీశ్ రావు, రాధకిషన్ రావు ఆదేశాల మేరకు ట్యాప్ చేశారని చక్రధర్ తన ఫిర్యాదులో వెల్లడించారు. అదేవిధంగా తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారని చక్రధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై కేసు నమోదయ్యాయి.