తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహిస్తోంది. మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, సిద్ధాంతాలపై చర్చించనున్నారు. మహానాడు కోసం కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. దీని కోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది కూర్చునేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. చివరి రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా మహానాడుకు వచ్చే కార్యకర్తలకు విందు భోజనాలతో కడుపు నింపే ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. మొదటి రోజు భోజనంలో తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ ప్రధానంగా ఉంటాయన్నారు. రెండో రోజు అల్లూరయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడో రోజు బగారా రైస్, చికెన్ కర్రీతో మెనూ ఉంటుందన్నారు. వెజ్లో కొన్ని కూరలు, సాంబారు, రసం వంటివి ఉంటాయన్నారు. ఈసారి ఆవకాయ కూడా ప్రత్యేకంగా ఉండనుందని తెలిపిన చింతమనేని దానికోసం దెందలూరు నుంచి ప్రత్యేకంగా మామిడికాయలు తీసుకొచ్చానని చెప్పారు.
మహానాడు ప్రాంగణంలో అన్ని వైపులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు ఏర్పాటు చేస్తున్నారు. కాగా వంటలకోసం 1,700 మంది వంటవారు వడ్డించేందుకు మరో 800 మందిని నియమించినట్లు తెలిపారు. మహానాడులో విజయవాడకు చెందిన అంబికాస్ క్యాటరింగ్ వారు భోజనాలను తయారు చేస్తున్నారు. 2014 నుంచి మహానాడులో క్యాటరింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి శివాజీ తెలిపారు.