అక్రమ కేసులకు తాము భయపడబోమని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినా, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినా, సభలు, సమావేశాలు పెట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను నెట్టుకొస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎల్రక్టానిక్ మీడియా చానల్ చర్చలో మైనర్ బాలిక పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని, ఇది బాలిక హక్కుల రక్షణకు భంగం కలిగిస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మాధవ్ గురువారం విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. మాధవ్ను సైబర్ క్రైం స్టేషన్ సీఐ శ్రీను మధ్యాహ్నం 12.40 నుంచి 1.25 గంటల వరకు విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపితే ఎందుకు స్పందించలేదు?, మైనర్ బాలిక పేరును చర్చలో ఎందుకు ప్రస్తావించారు?, బాలిక పేరు ప్రస్తావించడం తప్పని మీకు తెలీదా? అని సీఐ ప్రశ్నించినట్లు సమాచారం.