స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని చెప్పారు. మూడు బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తమ సవరణలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అవసరమైతే సభలో డివిజన్ కు కూడా పట్టుబడుతామని స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. నవంబర్ లోగా కులగణన పూర్తి చేస్తామని అధికారపార్టీ చెప్పిందన్నారు. కులగణనపై తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు.