జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయలకుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతగానో ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అని సీఎం రేవంత్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావం తెలపడంతో పాటు ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలనే కాంగ్రెస్ అధిష్ఠాన పిలుపులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు.