వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవి ని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం తన రాజ్యసభ పదవితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతేగాక ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని, తనపై ఎవరి ఒత్తిడి లేదని అన్నారు.
తాను ఇకపై ఏ పార్టీలో చేరనని, వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల రాజీనామాలపై గురువారం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలని, భయం ప్రలోభాలకు తగ్గి క్యరెక్టర్ ను తగ్గించుకోవద్దని అన్నారు. అంతేగాక విజయసాయిరెడ్డి సహా ఎవరికైనా ఇది వర్తిస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో జగన్ మోహన్ రెడ్డితో పొసగకనే విజయసాయిరెడ్డి వైసీపీని వీడారా? అని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. జగన్ కు, ఆయన కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీని వీడటం, విజయసాయి రెడ్డి, శర్మిలతో భేటీ అయ్యారని వార్తలు రావడం, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వేయడం, ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే, ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.