వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం..

vijaya-sai-reddy-25-.jpg

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం(జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదన్న విజయసాయిరెడ్డి, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన పేర్కొన్నారు.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించానన్న విజయసాయిరెడ్డి, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తు వ్యవసాయం అన్న విజయసాయిరెడ్డి, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this post

scroll to top