జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేశ్ మరోమారు దాడి ప్రారంభించారు. పవన్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. 2014లో పవన్ మాట్లాడుతూ తానో సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టకపోతే పట్టుకెళ్లిపోయారని చెప్పారని, అలాంటి పవన్ ఆస్తులు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ. 2 వేల కోట్ల వరకు ఉన్నాయని ఆరోపించారు. ఇది తనకు తెలిసిన లెక్క అని, తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఈ పదేళ్లలో అలా సంపాదించడానికి గల కారణమేంటో చెబితే పేదలు కూడా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక పార్టీని మూసేస్తే.. పవన్ మాత్రం పార్టీ పెట్టడానికి ముందే చంద్రబాబుకు అమ్మేసి, డబ్బులు తీసుకుని పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్ను ఒక పొలిటికల్ ఫోర్ట్వంటీ అని తీవ్ర విమర్శలు చేశారు.